Monday, September 24, 2012

బాలికపై 12 మంది అత్యాచారం: ప్రేమ పేరుతో మోసం


 Minor Girl Assaulted Hisar
చండీగఢ్: ప్రేమ పేరుతో మోసం చేసి పదహారేళ్ల అమ్మాయిపై 12 మంది అత్యాచారం చేసిన దుర్ఘటన చండీగఢ్‌లో జరిగింది. అమ్మాయిని ప్రేమించిన వ్యక్తే ఆమెపై మరో 11 మందితో కలిసి సామూహిక అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటన జరిగిన పది రోజుల తర్వాత.. బాధితురాలు కుటుంబ సభ్యులకు చెప్పగా, ఆ మరుసటి రోజే తండ్రి గుండె పగిలి మరణించాడు. హర్యానాలోని హిసార్ ప్రాంతం దబ్రా కుగ్రామంలోజరిగిన ఈ ఘటన ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది.
దీనిపై ఆమె సామాజిక వర్గం ఆందోళనబాట పట్టగా.. ప్రేమికుడిగా భావిస్తున్న మహేందర్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. బాధితురాలి కథనం ప్రకారం.. ఈ నెల తొమ్మిదో తేదీన ఊరికి దగ్గర్లోని పటేల్‌నగర్‌కు ఆమె బయలుదేరింది. దారిలో మహేందర్ కలిశాడు. మాటల్లోపెట్టి పక్కనే ఉన్న తోపులోకి తీసుకెళ్లాడు. ఆ మాటా ఈ మాటా మాట్లాడిన అనంతరం సమీపానే ఉన్న తన స్నేహితులకు సైగ చేశాడు. ఒక్కసారిగా 12 మంది వారిద్దరిని చుట్టుముట్టారు.
అందరూ కలిసి ఆమె నోరు మూసేశారు. ఆమె తేరుకునేలోపలే బలవంతంగా సమీపంలోని చెరుకు తోటలోకి తీసుకెళ్లారు. కొందరు కాపలా నిలబడగా.. మిగతావారంతా అత్యాచారానికి పాల్పడ్డారు. అరిచి గోల చేయకుండా పెద్దమొత్తంలో నిద్రమాత్రలు మింగించారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను పటేల్‌నగర్‌లోని బంధువు ఇంటికి దగ్గర్లో పడేసిపోయారు. పది రోజుల తరువాత.. ఈ నెల 19వ తేదీన ధైర్యం తెచ్చుకొని ఆమె ఈ విషయం ఇంట్లో చెప్పింది.
అది విన్న ఆమె తండ్రి కృష్ణ తట్టుకోలేకపోయాడు. మరుసటి రోజే గుండెపోటుతో మరణించాడు. ఈ ఘటనపై గ్రామంలోని దళిత కుటుంబాలు ఉద్యమబాట పడ్డాయి. మహేందర్ సహా 12 మందిని అరెస్టు చేసేదాకా కృష్ణ మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి తీసుకెళ్లేది లేదని భీష్మించాయి. కాగా, మహేందర్ బృందంలోని వాడిగా భావిస్తున్న శీతూను పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. నిజానికి.. అప్పటిదాకా తొమ్మిది మందే ఉన్నట్టు భావించిన పోలీసులు, శీతూ వాంగ్మూలంతో అవాక్కయ్యారు.

No comments:

Post a Comment