చైనాలో వెల వెల బోయిన భారత ప్రజాస్వామ్యం, సెక్యులరిజం

ప్రజాస్వామిక హక్కులు లేవనీ, మానవ హక్కులు మంట గలుస్తున్నాయనీ, భావ ప్రకటనా స్వేచ్చకీ ఇనప దడులు కట్టారనీ చైనాను ఆడిపోసుకోవడం కద్దు. భారత దేశంలోని హిందూమత శక్తులు చైనా మానవహక్కుల చరిత్రపై దాడులకు సదా సిద్ధంగా ఉంటాయి. అలాంటి చోటనే భారతీయులు ఏర్పరిచిన కళా ప్రదర్శనలో గుజరాత్ మత మారణకాండ పై ఉంచిన చిన్న వీడియోను తొలగించాలని భారత ప్రభుత్వం స్వయంగా కోరి సఫలమయింది. కాంగ్రెస్ పార్టీ చెప్పుకునే సెక్యులరిజం నేతిబీర లోని నెయ్యి చందమేననీ, రాజకీయ అసమ్మతిని భరించలేకపోవడం ఒక్క చైనా లక్షణం మాత్రమే కాదనీ, అది సకల దేశాలలోని దోపిడీ శక్తుల ఉమ్మడి లక్షణమని ఈ ఘటన మరోసారి చాటి చెప్పింది.‘ఇండియన్ హై వే’ పేరుతో సమకాలీన కళా ప్రదర్శన 2008 నుండి ప్రపంచంలోని వివిధ ప్రముఖ ప్రాంతాలలో జరుగుతోంది. లండన్ కి చెందిన ‘సర్పెంటైన్ గ్యాలరీ’ కి చెందిన క్యురేటర్లు జూలియా పేటన్-జోన్స్, హేన్స్ ఉల్రిచ్ ఒబ్రిస్ట్ లు దీనిని నిర్వహిస్తున్నారు. కనీసం నాలుగు దేశాలలో ఈ ప్రదర్శనలు చోటు చేసుకున్నాయి. ఓస్లో, ల్యోన్, రోమ్ నగరాలలో ప్రదర్శనలు జరిగాక జూన్ 23 నుండి చైనా రాజధాని బీజింగ్ లో ప్రదర్శన ప్రాంభమయింది.బీజింగ్ కి చెందిన ప్రఖ్యాత ప్రవేటు ఆర్ట్ గ్యాలరీ సంస్ధ ‘ఉల్లేన్స్ సెంటర్ ఫర్ కాంటెంపరరీ ఆర్ట్’ ఈ కళా ప్రదర్శన ఖర్చులను భరిస్తోంది. చైనాలో భారత దేశ కళల ప్రదర్శనకు సంబంధించి ఇదే అతి పెద్ద ప్రదర్శన అని తెలుస్తోంది. ప్రతి రోజూ వెయ్యికి పైగా ప్రజలు గ్యాలరీని సందర్శిస్తున్నారనీ, వారాంతంలో సందర్శకుల సంఖ్య పదివేలకు మించుతోందనీ ‘ది హిందూ’ పత్రిక తెలిపింది. ఈ ప్రదర్శన నుండి గుజరాత్ ముస్లిం మారణకాండ విషయమై ప్రదర్శిస్తున్న చిన్న వీడియో ను భారత ప్రభుత్వ కోరిక మేరకు తొలగించడంతో ‘భావ ప్రకటనా స్వేచ్ఛ’ కు భారత ప్రభుత్వం ఇస్తున్న విలువ ఏ పాటిదో తేటతెల్లమయింది.బీజింగ్ లో జరుగుతున్న ‘ఇండియన్ హై వే’ కళా ప్రదర్శనలో 29 మంది కళాకారులకు చెందిన 200 కి పైగా కళాకృతులు ప్రదర్శితం అవుతున్నాయి. భారత అధికారుల ప్రకారం చైనా ప్రేక్షకులకు ప్రజాస్వామ్య భారత దేశంలోని ప్రజాస్వామిక అభిప్రాయాల వైవిధ్యం గురించి తెలియజేయడానికి ఈ ప్రదర్శనను ఉద్దేశించారు. భారత ప్రజాస్వామ్య వైవిధ్యం గురించి చెప్పే చోట ఒక మతానికి చెందిన ప్రజలపై సాగిన అమానుష హత్యాకాండ గురించిన సమాచారానికి, కళా ప్రదర్శనకు తావు లేదని భారత పాలకులు చెప్పదలిచారు. తద్వారా ప్రదర్శన లక్ష్యం పట్ల గౌరవం లేదని చాటుకున్నారు. సెక్యులరిస్టులమనీ, బి.జె.పి మతతత్వానికి వ్యతిరేకులమనీ చెప్పుకునే కాంగ్రెస్ పాలకులే ఈ విధంగా ఒక మతప్రజల అణచివేతపై అసమ్మతిని తెలియజేయకుండా అడ్డుకోవడం దారుణం.గుజరాత్ నరమేధం పై ఉంచిన వీడియో నిడివి కేవలం 4 నిమిషాలు మాత్రమే. అందులో నరమేధం గురించి చర్చిస్తున్న ఇంటర్వ్యూలు మాత్రమే ఉన్నాయి. నరమేధాన్ని ప్రత్యక్షంగా రికార్డు చేసి చూపడం లాంటిదేమీ లేదు. తేజల్ షా రూపొందించిన ఈ వీడియో టైటిల్ ‘ఐ లవ్ మై ఇండియా’. సర్పెంటైన్ గ్యాలరీ సంస్ధ ప్రకారం “2002 లో గుజరాత్ రాష్ట్రంలో ముస్లిం మైనారిటీ లపై హత్యాకాండ (genocide) పై విస్మరణ (ignorance) అవగాహన లేమి (lack of understanding) లపై కేంద్రీకరింధింది.” జూన్ 23 న భారత రాయబారి జయ శంకర్ చేత ప్రదర్శన ప్రారంభం అయినపుడు ఈ వీడియో లేదు. సాంకేతిక సమస్యల వల్ల కొన్ని వీడియోలు ప్రదర్శించలేకపోతున్నామని గ్యాలరీ అప్పడు ప్రకటించింది.గుజరాత్ పై వీడియో ప్రారంభం అయిన విషయాన్ని చైనా మీడియా ప్రకటించిన తర్వాత దానిని తొలగించాలని భారత ప్రభుత్వం ఆతిధ్య గ్యాలరీ సంస్ధను కోరింది. ప్రభుత్వ కోరిక మేరకు వీడియోను తొలగించడం కూడా జరిగిపోయింది. న్యూఢిల్లీలో విలేఖరులతో మాట్లాడుతూ భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వీడియో తొలగింపుపై వివరణ ఇచ్చింది. “కొందరు యువకుల యాదృచ్ఛిక (random) ఇంటర్వ్యూలు” ఉన్నాయని మంత్రిత్వ శాఖ అంగీకరించినప్పటికీ “రాజకీయంగా కొన్ని వివాదాస్పద ఛాయలు” ఉన్నాయని వ్యాఖ్యానించింది. “నిర్వాహకులతో ఈ అంశాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ చర్చించాక వీడియో తొలగించబడింది” అని తెలిపింది.విచిత్రం ఏమిటంటే ఈశాన్య రాష్ట్రాలలోని సమస్యలు, అక్కడి ప్రజలపై భారత సైన్యం సాగిస్తున్న దమనకాండ ల గురించి వివరిస్తున్న వీడియోలు ప్రారంభం నుండీ ప్రదర్శనకు నోచుకున్నాయి. ఈ వీడియోల గురించి ప్రారంభం రోజునే భారత అధికారులను విలేఖరులు ప్రశ్నించినపుడు ప్రదర్శనను ఒక ప్రవేటు గ్యాలరీ వారు నిర్వహిస్తున్నందున తాము చేయగలిగేది ఏమీ లేదని, అందువల్ల ప్రదర్శనకు తమ అనుమతి ఇవ్వాలని గానీ, వివిధ కళా ప్రదర్శనలకు తమ అనుమతి అవసరమని గానీ తాము భావించలేదనీ చెప్పారని ‘ది హిందూ’ తెలిపింది. కళా ప్రదర్శకులలో కేవలం ఇద్దరికీ మాత్రమే, అదీ పాక్షికంగా మాత్రమే ఖర్చులు భరిస్తున్నామనీ ఇతర ఖర్చులన్నీ బీజింగ్ కి చెందిన ‘ఉల్లేన్స్ సెంటర్ ఫర్ కాంటెంపరరీ ఆర్ట్’ వారే భరించారనీ భారత అధికారులు తెలిపారు.హిందూ మతం భారత సంస్కృతే అయితే పరమత సహనం పాటించలేనితనం కూడా భారతీయుల సంస్కృతిగా అంగీకరించవలసి ఉంటుంది. కానీ భారతీయుల సంస్కృతి అది కాదు. భిన్నత్వంలో ఏకత్వం భారతీయుల సంస్కృతి. అనేకానేక విదేశీ సంస్కృతులను తనలో కలిపేసుకుని లేదా అక్కున చేర్చుకుని ప్రశాంతంగా సహజీవనం చేయగలిగిన సంస్కృతి భారతీయులది. ఈ సంస్కృతిలోకి మత శక్తులు జొరబడడం వల్లనే శతృత్వాలు రగిలి తోటి మానవులపై హత్యాకాండలు సాగించే విపరీత బుద్ధులు చోటు చేసుకుంటున్నాయి. అందువల్ల భారతీయులు మత దురహంకార శక్తులను దూరం పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది.
No comments:
Post a Comment